ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్‌ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 04:45 PM

కాంగ్రెస్‌ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాలు దిల్లీలో జరుగుతున్నాయి. రాహుల్‌గాంధీ తొలిసారి అధ్యక్ష హోదాలో ఈ ప్లీనరీలో ప్రసంగించారు. దేశాన్ని ఐక్యం చేసి ముందుకు నడిపించేది చేతి గుర్తేనని రాహుల్‌ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్‌ ప్రసంగం తర్వాత మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌, సిద్ధరామయ్య వంటి పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ అధికార భాజపాపై విమర్శల వర్షం కురిపించారు.


లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశ ప్రజలందరిది. జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఎన్నో పరిశ్రమలను, నీటి పారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించింది. భారత్‌కు స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని అందించింది. ఆ ప్రజాస్వామ్యం వల్లే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారింది’ అని ఆరోపించారు.


అనంతరం సీనియర్‌ నేత శశిథరూర్‌ సామాజిక న్యాయం తదితర అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ‘56 అంగుళాల ఛాతీ ఉంటే సరిపోదు. అందుకు తగ్గ మనసు కూడా ఉండాలి. మనం హిందువులం మాత్రమే కాదు.. హిందుస్థానీయులం’ అని శశిథరూర్‌ అన్నారు.


 


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ ప్లీనరీలో పాల్గొని ప్రసంగించారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లౌకికవాదానికి, మతోన్మాదానికి మధ్య జరిగే పోరు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద విజయాన్ని సాధిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయం నూతనోత్సాహన్ని ఇస్తుంది’ అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం సాధిస్తుందని సచిన్‌ పైలట్‌ అన్నారు. రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రజలకు మరింతగా చేరువవుతుందన్నారు.


శుక్రవారం ప్రారంభమైన ఈ ప్లీనరీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పార్టీ సీనియర్‌ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com