కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాలు దిల్లీలో జరుగుతున్నాయి. రాహుల్గాంధీ తొలిసారి అధ్యక్ష హోదాలో ఈ ప్లీనరీలో ప్రసంగించారు. దేశాన్ని ఐక్యం చేసి ముందుకు నడిపించేది చేతి గుర్తేనని రాహుల్ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్ ప్రసంగం తర్వాత మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, సిద్ధరామయ్య వంటి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అధికార భాజపాపై విమర్శల వర్షం కురిపించారు.
లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలందరిది. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నో పరిశ్రమలను, నీటి పారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించింది. భారత్కు స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని అందించింది. ఆ ప్రజాస్వామ్యం వల్లే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారింది’ అని ఆరోపించారు.
అనంతరం సీనియర్ నేత శశిథరూర్ సామాజిక న్యాయం తదితర అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ‘56 అంగుళాల ఛాతీ ఉంటే సరిపోదు. అందుకు తగ్గ మనసు కూడా ఉండాలి. మనం హిందువులం మాత్రమే కాదు.. హిందుస్థానీయులం’ అని శశిథరూర్ అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ ప్లీనరీలో పాల్గొని ప్రసంగించారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లౌకికవాదానికి, మతోన్మాదానికి మధ్య జరిగే పోరు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద విజయాన్ని సాధిస్తుంది. లోక్సభ ఎన్నికలకు ఈ విజయం నూతనోత్సాహన్ని ఇస్తుంది’ అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని సచిన్ పైలట్ అన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజలకు మరింతగా చేరువవుతుందన్నారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ప్లీనరీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.