న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ శక్తి భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అవసరమైతే భారత దళాలు సరిహద్దును దాటేందుకు కూడా సిద్ధమేనని ఆయన నొక్కి చెప్పారు. రైజింగ్ ఇండియా సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కశ్మీర్ మనదేనని, మన దగ్గరి నుంచి ఏ ఒక్కరూ తీసుకుపోలేరని అన్నారు.
ఈ సందర్భంగా భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. అంతర్గతంగా దేశానికి భద్రతను కల్పించడం మాత్రమే కాదు. అవసరమైతే దేశాన్ని రక్షించుకోవడానికి బోర్డర్ను దాటడానికి భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు. పాకిస్థాన్తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత్ కోరుకుంటోందని.. ఐతే ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని పాక్ నిలిపివేస్తేనే అది జరుగుతుందన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ చర్యలను అమెరికా ఖండిస్తోంది. పాక్కు ఏం జరుగుతుందో మాత్రం నాకు తెలియదు. స్నేహాపూర్వక సంబంధాలు కొనసాగిద్దామని తాము చేసిన ప్రతిపాదనలను పాక్ నిరాకరిస్తోందని రాజ్నాథ్ వెల్లడించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఏం చేయడానికైనా భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అక్కడి వారితో చర్చలు జరపడానికి ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.