తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనేక పార్టీలు మద్దతు పలికాయని.. గంటలోనే సానుకూల స్పందన రావటం జాతీయస్థాయిలో తెలుగుదేశం విశ్వసనీయతకు నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. పీఎంవో చుట్టూ ఏ2 చక్కర్లు కొట్టడంతో అవిశ్వాసం అన్న వైకాపాను ఎవ్వరూ నమ్మలేదని చంద్రబాబు విమర్శించారు. కేసుల మాఫీకే విజయసాయి రెడ్డి పీఎంవోలో తిరుగుతున్నారని ఆరోపించారు. కేంద్ర పెద్దలకు పాదాభివందనాలు, ప్రదక్షిణలు కేసుల మాఫీ కోసమేనని దుయ్యబట్టారు. ఇప్పుడే జగన్ కేసులకు సడలింపులు ఎందుకు వస్తున్నాయని కేంద్రాన్ని ప్రశ్నించారు. జగన్ అనుచరులు పీఎంవోలోనే ఉంటున్నారని.. దానికి ప్రతిగానే కేసులలో సడలింపులని ఎంపీలతో అన్నారు.
రేపోమాపో జగన్ కేసులు కొట్టివేస్తారనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. తెదేపా అవిశ్వాసానికి అనేక పార్టీలు మద్దతు ఇస్తున్నాయని.. అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని...,డివిజన్ అడగాలని పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేశారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఈ రెండురోజులు దిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. మూడు పార్టీల మహా కుట్రను ప్రజల్లో బయటపెట్టామని చెప్పారు. జగన్, పవన్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను విమర్శించటమేమిటని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సమయంలో తనను బలహీనపరిచే ప్రయత్నం చేసి ఎవరికి లాభం చేకూరుస్తున్నారని ప్రశ్నించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోందన్న సీఎం.. జాతీయ స్థాయిలో ఏపీ ప్రజల గొంతు వినిపించామని అభిప్రాయపడ్డారు. తమకు కావాల్సింది రాజకీయం కాదని.. రాష్ట్రానికి న్యాయం జరగడమే తమ లక్ష్యమని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు.