అమరావతి: రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిబద్ధతను ఎవరూ శంకించలేరు. ప్రజాజీవితంతో అంతగా పెనవేసుకుపోయారాయన. నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలియచెప్పే ఘటన ఒకదాన్ని. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పంచుకున్నారు. అది 2007 ఆగస్ట్.. తనయుడు లోకేశ్ పెళ్లి హడావుడిలో బాబు ఉన్నారు. బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. నవదంపతులను ఆశీర్వదించడానికి అతిరథమహారథులు వచ్చారు. హైటెక్స్లో ఆగస్ట్ 26న పెళ్లి ఘనంగా జరిగింది. అయితే అంతకు ముందు రోజు 25వ తారీఖున రాత్రి హైదరాబాద్లో తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. వరుస పేలుళ్లతో నగరం నెత్తురోడింది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో ప్రజలు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఈ వార్తతో తీవ్రంగా చలించిన ఆయన.. ఒకపక్క పెళ్లిపనులు చక్కబెడుతూనే.. మరోపక్క తన పార్టీ నేతల ద్వారా బాధితుల గురించి తెలుసుకున్నారు. ఉదయం ఇలా పెళ్లి ముగిసిందో లేదో.. చకచకా పెళ్లి బట్టలు మార్చుకొని... హడావుడిగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను గమనించి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలో చెప్పే ఘటన ఇది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మంచి చెడులను ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.