వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు అంటోంది శివసేన. మోడీది అబద్ధాల మార్గాన నడిచే పాలన అని.. వారికి ఓటమి తప్పదు అని సేన అంటోంది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ ప్రచురితం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, ఫూల్ పూర్ ఎంపీ సీట్ల ఫలితాలపై స్పందిస్తూ.. సామ్నా ఎడిటోరియల్ లో ఆసక్తిదాయకమైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్లలో బీజేపీకి ఓటమి తప్పదని, వీటిలోని 110 సీట్లను వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ కోల్పోయే అవకాశం ఉందని సేన అభిప్రాయపడింది.
ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్ల సంఖ్య 272 కాగా, వీటిల్లో 110 సీట్లను ఆ పార్టీ కోల్పోతోందని తన అధికారిక పత్రికలో సేన అంచనా వేసింది. అంటే బీజేపీ కేవలం 162 సీట్లకే పరిమితం అవుతుందనేది సేన అంచనా. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మెజారిటీకి చాలా దూరాన నిలుస్తుందని సేన అంచనా వేసింది.
తాము వచ్చేసారి బీజేపీతో కలిసి పోటీ చేయమని శివసేన ప్రకటించింది. ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన ల ఆధ్వర్యంలోని ప్రభుత్వమే మనుగడలో ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తాము బీజేపీతో జట్టుకట్టమని సేన అంటోంది. ఉత్తరప్రదేశ్ లో తమకు పట్టున్న నియోజకవర్గాలనే బీజేపీ కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదనేందుకు ఇంతకన్నా రుజువేం కావాలి? అని సేన ప్రశ్నించింది.