గుంటూరు దుర్ఘటన శాఖాపరమైన వైఫల్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఒక వ్యక్తి వైఫల్యం 10మంది మృతికి కారణం కావడం దురదృష్టకరమన్నారు. విపత్తు వస్తే దానిని చక్కదిద్దేవరకు వదిలిపెట్టకూడదన్నారు. 'విశాఖలో హుద్హుద్ అప్పుడు ఎలా చేశాం..? గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైంది..? అంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా వైఫల్యం చెందితే ఉన్నతస్థాయి యంత్రాంగం చక్కదిద్దాలని, అధికార యంత్రాంగం పనితీరు ప్రభుత్వం గౌరవం పెంచేలా ఉండాలన్నారు. తప్పు జరగకూడదు.. ఒకవేళ జరిగితే సకాలంలో సరిదిద్దాలన్నారు. ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, రోడ్లు తవ్వడం, గుంతలు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. నివాసాల కింద వున్న పైపులైన్ల తొలగించి నూతనంగా పైపులైన్ల ఏర్పాట్లు చేయాలని, పైపులైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, మురుగు కాలువలన్నీ శుభ్రపరచాలని ఆదేశించారు.