టీడీపీ, వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు సభ ఆర్డర్ లో లేదంటూ వాటిని పరిగణనలోకి తీసుకుండా సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ స్పందించారు. ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే అందుకు మద్దతుగా 50 మంది ఎంపీలు నిలబడాలి. ప్రస్తుత అవిశ్వాస తీర్మానానికి 50 మంది మద్దతు ఉంది. అయినా స్పీకర్ సభ నియంత్రణలో లేనందున దీన్ని పరిశీలించలేమని అన్నారు. దీంతో నేను ఒకటి అడగదలుచుకున్నా... ప్రభుత్వానికి ఎందుకని భయం? లోక్ సభలో వారికి పూర్తి మెజారిటీ ఉంది కదా అని పార్లమెంటు వెలుపల ఏఎన్ఐ మీడియా సంస్థతో థరూర్ అన్నారు. టీడీపీ, వైసీపీతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సైతం మోదీ సర్కారుపై అవిశ్వాసానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.