సూపర్ స్టార్ రజనీకాంత్ గత నాలుగు రోజుల నుండి ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదాలతో పాటు వారి సలహాలు తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఉన్న దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న రజనీకాంత్ తన అంతరాత్మని తెలుసుకునేందుకు ఆధ్యాత్మిక బాట పట్టినట్టు తెలిపారు. రాజకీయ పార్టీ పేరుని కూడా ప్రకటించని నేను ఆశ్రమంలో రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. గతంలో ఈ ఆశ్రమంకి తాను పలుసార్లు వచ్చినట్టు తెలిపారు . అమితాబ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న నేను, ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్ధించినట్టు తెలిపారు రజనీకాంత్. ఈ ఆధ్యాత్మిక పర్యటన తర్వాత రజనీకాంత్ కొద్ది రోజులు యూఎస్కి వెళ్ళి అక్కడ హెల్త్ చెకప్ చేయించుకోనున్నట్టు తెలుస్తుంది. తమిళ సంవత్సరాది సందర్భంగా రజనీకాంత్ తన పార్టీ పేరుని ప్రకటిస్తారని అంటున్నారు. పార్టీకి రజినీకాంత్ మక్కల్ మంద్రమ్ పేరు పెట్టే ఆలోచనలో తలైవా ఉన్నారని తమిళ తంబీలు భావిస్తున్నారు . రానున్న ఎన్నికలలో 234 స్థానాలలో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయనున్నారనే విషయం రజనీ గత ఏడాది ప్రకటించిన విషయం విదితమే. తలైవా నటించిన కాలా, 2.0 చిత్రాలు విడుదల కావలసి ఉంది.