వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందు చెప్పినట్టుగా తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ వచ్చే నెల 5వ తేదీన పదవులకు రాజీనామా చేయడం ఖాయమని మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము అవిశ్వాస తీర్మానం పెట్టనున్నామని, దాన్ని స్వీకరించాలా? వద్దా? అన్నది స్పీకర్ నిర్ణయమని అన్నారు. తప్పనిసరిగా అవిశ్వాసంపై చర్చ సాగాలంటే 50 మందికి పైగా ఎంపీలు కలసిరావాలని గుర్తు చేసిన ఆయన, మిగతా విపక్షపార్టీలతో ఈ విషయమై తాము చర్చిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేయగలిగిందంతా చేస్తున్నామని వెల్లడించిన మేకపాటి, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, తాము పెట్టనున్న అవిశ్వాసానికి వివిధ పార్టీలు మద్దతివ్వాలని నిర్ణయించాయని మరో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీలు కూడా కలసి వస్తారని భావిస్తున్నామని, వారిని ఒప్పించాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ పైనా ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పోరాటం ఓ భాగమని, ఏపీకి హోదా కోసం తాము అవిశ్రాంతంగా పోరాడతామని అన్నారు.