ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను కేంద్రం పట్టించుకోకపోవడమే అసలు సమస్య అని చంద్రబాబు అన్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ఆయన ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజీ ప్రశక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధికి మనం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలంటే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్ సూచనలు, సలహాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 కేసుల్లో ఎ-1 నిందితుడుగా ఉన్న వ్యక్తి నుంచి మనం రాజకీయాలు నేర్చుకోవాలా, అటువంటి వ్యక్తి నాయకత్వంలోని వైకాపా పార్టీని మనం ఫాలో కావాలా? అని ప్రశ్నించారు. కాగా కేంద్ర కేబినెట్ నుంచి వైదొలుగుతూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని జాతీయ పార్టీలు ప్రశంసించాయని ఈ సందర్భంగా ఎంపీలు చంద్రబాబుకు తెలిపారు.