ముంబైః పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో ఓ పీఎన్బీ అధికారికి నీరవ్ మోదీ బంగారు, వజ్ర ఆభరణాలను లంచంగా ఇచ్చినట్లు సీబీఐ చెప్పింది. 12 వేల కోట్లకుపైగా జరిగిన ఈ స్కాంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే. విదేశాల్లోని ఇండియన్ బ్యాంక్స్ నుంచి లోన్లు పొందేందుకు అవసరమైన అండర్టేకింగ్ లేఖలను ఇవ్వడానికి పీఎన్బీ అధికారులకు నీరవ్ లంచాలు ఇచ్చాడని తొలిసారి సీబీఐ చెప్పడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు. ఒక అధికారికి నగల రూపంలో భారీ లంచం ముట్టినట్లు సీబీఐ స్పష్టంచేసింది. ఆ అధికారి పేరు యశ్వంత్ జోషి. ఇతను ముంబై పీఎన్బీ బ్రాంచ్లో ఫారెక్స్ డిపార్ట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అతనికి నీరవ్ మోదీ 60 గ్రాములున్న రెండు బంగారు కాయిన్స్, బంగారం, వజ్రాలు పొదిగిన చెవిపోగులు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ ఆభరణాలను సీబీఐ అధికారులు జోషి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ ఈ స్కాంకు పాల్పడినట్లు చెప్పడానికి ఇదే నిదర్శనమని సీబీఐ అంటున్నది. నీరవ్కు అండర్టేకింగ్ లెటర్స్ ఇవ్వడానికి ఇలా జోషి లంచాలు తీసుకుంటూనే ఉన్నాడని చెప్పింది.