అమరావతి : ఎపి సమస్యల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందని టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అయితే అది ఎంతో కాలం ఉండదని ఆయన చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే పది రూపాయిలు భిక్ష వేసినట్లు ఇస్తారే తప్ప మరేమీ ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. పెద్ద దిక్కుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుంటే ఉపయోగం ఉంటుందని జెసి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వైకాపా సభ్యులు అవిశ్వాసాన్నిప్రవేశపెట్టినా అది వీగిపోతుందని టిడిపి ఎంపి జెసి అన్నారు. వీగిపోయే అవిశ్వాసాన్ని వైకాపా ప్రవేశపెట్టినా ఉపయోగం ఉండదని ఆయన చెప్పారు. అవిశ్వాసానికి అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టే పరిస్థితిలో జగన్ లేరని జెసి అన్నారు. వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసినా ప్రధాని మోడీకి వచ్చే నష్టమేమీ లేదని ఆయన చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల కేంద్రానికి నష్టమేమీ వాటిల్లదనిఅన్నారు. రైల్వే జోన్ ప్రకటించడం వల్ల కేంద్రానికి పోయేదేమీ లేదని, రాష్ట్రానికి అదనంగా వచ్చేదేమీ లేదని ఆయన చెప్పారు.