చెన్నై: కంచి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి నిన్న శివైక్యం చెందిన విషయం తెలిసిందే. కాసేపట్లో ఆయన మహాసమాధి కానున్నారు. కంచిమఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయన పార్థీవ దేహాన్ని నిన్నటి నుంచి లక్షకు పైగా భక్తులు సందర్శించారు. సనాతన ధర్మం పరిరక్షించే క్రమంలో జయేంద్ర సరస్వతి వారిది ఓ స్వర్ణయుగంగా పేర్కొంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు సన్యాస ఆశ్రమం స్వీకరించారు. చంద్రశేఖర స్వామితో పాటు మూడు సార్లు దేశమంతటా పాదయాత్ర చేశారు. కంచి పీఠం జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఆలయాలతో పాటు విద్యాలయాలు, వైద్యాలయాలు అవసరమని భావించి వాటి స్థాపనకు విశేష కృషి చేశారు. అదేవిధంగా వయోవృధ్దుల కోసం వృద్ధాలయాలు, గోవుల రక్షణకు గోశాలలను ఏర్పాటు చేశారు. జయేంద్ర సరస్వతి అభినవ శంకరులుగా పేరు గడించారు.