విశాఖ: విశాఖలో రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ‘రేపటి సాంకేతికతలు’ అంశంపై, రియల్ టైమ్ గవర్నెన్స్పై చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…సాంకేతికత విషయంలో ఏపీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని అన్నారు.దేశంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదన్నారు. ప్రజాసాధికార సర్వే ద్వారా డేటా బ్యాంక్ తయారు చేశామన్నారు. ప్రతి భూమికి భూధార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని అన్నారు. 2.8 కోట్ల వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలను ఆన్లైన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా అనుసంధానిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్నీ కాగిత రహిత కార్యాలయాలే ఉంటాయన్నారు.దేశంలోనే తొలిసారిగా డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. సాంకేతికతతో పరిపాలన సులభతరమైందన్నారు. ప్రజల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామన్న చంద్రబాబు 80 శాతం సంతృప్తి సాధించడమే తమకు ముఖ్యమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రెండు వేల మంది ఉద్యోగులు ప్రజల వినతులు స్వీకరిస్తుంటారని పేర్కొన్నారు. పరిపాలన కనిపించాలి, ప్రభుత్వం కాదన్నారు. మా ప్రభుత్వంలో ప్రతీదానికి సమాధానం ఉండాలన్నారు. అలెక్సా, గూగుల్ తరహాలో ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంటుందన్నారు.సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 2వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.