న్యూఢిల్లీ: కెనడా ప్రధాని ట్రూడో దంపతులకు ఇవాళ ప్రధాని మోదీ వెల్కమ్ చెప్పారు. రాష్ట్రపతి భవన్లో మోదీ జస్టిన్ ట్రూడోతో పాటు ఆయన భార్య, పిల్లలకు మోదీ విషెస్ చెప్పారు. అంతకముందు ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్లో గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. కెనడా ప్రధాని ట్రూడో భారత్లో ల్యాండైన అయిదు రోజుల తర్వాత ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ట్రూడో దంపతులను కలుసుకున్న మోదీ వారితో గ్రూపు ఫోటో కూడా దిగారు. ఇవాళ ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్న సిక్కులతో ట్రూడో అత్యంత సన్నిహితంగా ఉండడం కొంత వివాదాస్పదమైంది. కెనడా ప్రధానికి ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్ని కూడా డిన్నర్కు ఆహ్వానించడం చర్చనీయాశమైంది. కానీ ట్రూడో ఆ ఘటనపై స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ జరిగే ద్వైపాక్షిక చర్చల్లో.. వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఉగ్రవాద పోరులోనూ రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం జరగనున్నది.