రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. విభజన హామీల పట్ల ఏ పార్టీల అజెండా ఎలా ఉన్నాసరే, మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి పెద్దగా సాయం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాల్సిన బీజేపీ నేతలు కూడా కేంద్రం ఇంత ఇచ్చింది, అంత ఇచ్చింది అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలనూ కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగితే కొంత ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎక్కడా రాజీపడలేదని పేర్కొన్నారు. హోదాకు బదులుగా సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే సరే అన్నామని వివరించారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలు మనకు దక్కాల్సిందేనన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ఆనాడు ఏఏ ప్రయోజనాలు ఇస్తామన్నారో అవన్నీ మనకు దక్కాల్సిందేనన్నారు. వైసీపీ రోజుకోమాట మాట్లాడుతోందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుందని తొలుత పొగిడింది వైకాపానేనన్నారు. హోదాను ఓ సెంటిమెంట్గా జగన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.