అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే 45 రోజులు నరేగా పనులు ముమ్మరం కావాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు పెంపొందాలన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలుకాలేదన్నారు. మన రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధుల పోరాటం, అధికారుల కృషి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో మనకు పని లేదన్నారు. మన సామర్థ్యమే మనకు శ్రీరామరక్ష అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం జరగాలని అన్నారు. పండ్ల తోటల సాగుతో మరింత లాభం ఒనగూడుతుందని ఆయన చెప్పారు. మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్టమైన వ్యవస్థ తీసుకు రావాలని ఆయన సూచించారు.