త్రిపుర: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మొత 59 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్ కోసం 3214 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా... సీపీఎం అభ్యర్థి చనిపోయిన కారణంగా చారిలాం అసెంబ్లీ స్థానానికి మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ 59 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక.. త్రిపురను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న సీపీఎంకు ఈసారి బీజేపీ గట్టి సవాలు విసురుతున్నది. రాష్ట్రంలో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న ఎర్రజెండా పార్టీకి కమలం పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. 20 అసెంబ్లీ స్థానాల్లో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ ఇక్కడ ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగు బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రచారం చేసిన ఇతర అగ్రనాయకుల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అరుణ్జైట్లీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఉన్నారు.