ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందువల్లే ప్రత్యేక హోదా రాలేదు : పవన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 05:06 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని, ఎంపీలు సరిగా పనిచేయకపోవడంతోనే ప్రత్యేక హోదా రాలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదన్నారు. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన మేధోమథన సమావేశం విజయవంతమైంది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా, హామీల అమలు విషయంలో మేం ఎందుకు ఇంత గట్టిగా పోరాడుతున్నామంటే.. అప్పట్లో రాజకీయ అనుభవజ్ఞులు కొద్దిమంది అనుకుని ఆంధ్రా, తెలంగాణలను కలిపారు. తెలంగాణకు అండంగా నిలబడతాం అని చెప్పారు. అయితే వాటిని పాటించకపోవడం వల్ల దశాబ్దాల పాటు సమస్య పేరుకుపోయి జఠిలమై, తెలంగాణను విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇలాగే మభ్యపెడితే ప్రజల్లో విసుగు వచ్చేస్తుంది. యూపీఏ హయాంలో కూడా ఎంపీలు సరిగా స్పందించలేకపోయారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. ఒకవేళ దానిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, వాళ్లంటే అందరికీ భయం ఉండేది. వారి వ్యక్తిగత సమస్యల కారణంగా, ఆశల వల్ల, తమకు అవకాశాలు దక్కవేమోనన్న భయంతో కేంద్రాన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం చేయలేదు. అప్పుడు యూపీఏలో అదే జరిగింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కూడా అదే జరుగుతోంది. దీనివల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందవచ్చేమో కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలు.’’


‘‘ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది. విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను కలిపారు. ఈ పరిస్థితుల్లో కలిసి ఉంచవచ్చని రకరకాల వాగ్దానాలు చేశారు. అవి చేయలేకపోయే సరికి ‘జైఆంధ్రా’ఉద్యమం వచ్చింది. దానిలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలు కోల్పోయారు. అది సమసిపోయిందనుకున్నారు. అయితే నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆ ఉద్యమం బద్దలై 10లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి ‘మా రాష్ట్రం మాకు కావాలి. మీరంతా వెళ్లిపోండి’అనే పరిస్థితికి దారితీసింది. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు శిక్షను ప్రజలు అనుభవిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన ఈ సమస్య ఇప్పుడు విద్యార్థులకూ తగిలే పరిస్థితికి వచ్చింది. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే కచ్చితమైన ఆలోచనా విధానంతో వెళ్తున్నాం. అందుకు ఇది మొదటి మెట్టు’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com