బ్యాంకింగ్ రంగంలోనే సంచలనం సృష్టిస్తోన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) రూ.11వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన కీలకమైన వ్యక్తిని శనివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేసులో కీలకమైన వ్యక్తి పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, ఎస్డబ్ల్యూఓ(సింగిల్ విండో ఆపరేటర్) మనోజ్ కారట్, నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన అధికారి హేమంత్ భట్ను అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ఈ ముగ్గురినీ హాజరుపరచనున్నారు.
రూ.11వేల కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీకి శెట్టి సహాయం చేసినట్లు అధికారులు తెలిపారు. శెట్టి ఇంట్లో గురువారం, శుక్రవారం సీబీఐ అధికారులు పలు సోదాలు జరిపారు. ఈ ముగ్గురుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతడి భాగస్వామి మెహుల్ చోక్సీలు.. పీఎన్బీకు రూ.11,400కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా దాడులు చేపట్టారు. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్టులను విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ కేసు వెలుగులోకి రాక ముందే వీరిద్దరూ విదేశాలకు చెక్కేశారు. దేశం విడిచి వెళ్లిపోయిన నీరవ్, చోక్సీల ఆచూకీ కోసం సీబీఐ అధికారులు ఇంటర్పోల్ అధికారుల సహాయం కోరారు.