ఉరవకొండ: తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడని సిఎం చంద్రబాబుపై వైసిపి ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి,మాజీఎంపి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే జగన్ విసిరిన రాజీనామాల సవాల్ ను స్వీకరించాలన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని అమిద్యాల లో పార్టీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసారో వారు వివరించారు. రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను పట్టించుకోకుండా ప్యాకేజీకి ఒప్పుకొని ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో మోసం,వెన్నుపోటు తప్ప మరేమిలేవన్నారు. వైఎస్ జగన్ నిజాయితీగా ఎంపీల రాజీనామాలు ప్రకటిస్తే దాన్ని కూడా తప్పుబట్టడం చంద్రబాబు దివాలకోరుతనానికి నిదర్శనమన్నారు. జగన్ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.