నెల్లూరు: భక్తి ముసుగులో మరో దొంగ బాబా భక్తులకు భారీగా టోకరా వేశాడు. ఆశ్రమంలో యాగం నిర్వహిస్తున్నానంటూ ఈ బాబా తన అనుచరుల ద్వారా భక్తుల నుంచి కోట్లు వసూళ్లు చేయించాడు. యాగ నిర్వహణకు డబ్బులు ఇస్తే ఆ తర్వాత అంతకు రెట్టింపు ధనం ఇస్తామంటూ బాబా అనుచరులుగా చెప్పుకున్న ఓ జంట భక్తుల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేశారు. అయితే ఆ తరువాత వారు కనిపించకుండా పోవడంతో భక్తులు బాబాను నిలదీశారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల్లూరు నగరంలో చోటుచేసుకున్నఈ ఘటన సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే...నెల్లూరు ప్రశాంతినగర్లో సుధాకర్బాబా అనే వ్యక్తి గురుదత్తాత్రేయ ఆశ్రమాన్నినిర్వహిస్తున్నాడు. ఈ బాబా ఇటీవల 105 రోజుల పాటు నవనాద సంప్రదాయ శ్రీ గురుదత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.దీంతో ఈ యాగం ఏర్పాట్లు కోసమంటూ మరో జిల్లాకు చెందిన ఒక జంట తమ కుటుంబ సభ్యులతో ఆశ్రమానికి చేరుకుంది.
ఈ క్రమంలో భక్తులకు ఆ దంపతులు యాగానికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేస్తూ...తాము చెప్పినట్లు చేస్తే ఈ యాగం అనంతరం పెద్ద ఎత్తున ధనం సమకూరుతుందని వారు నమ్మబలికారు.దీంతో భక్తులు ఈ బాబాపై తమకు ఉన్న నమ్మకంతో ఒక్కొక్కరూ రూ. 50 వేల చెల్లించి ఆ దంపతులు, వారి కుటుంబ సభ్యుల నుంచి యాగానికి సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వారు పుస్తకాలు భక్తులకు ఇస్తూ తాము చెప్పిన విధంగా చేసి సూచించిన మంత్రాన్ని ఆ పుస్తకంలో రాస్తే ఒక్కో పుస్తకానికి రూ.2 వేల చొప్పున తిరిగి ఇస్తామని, తద్వారా ఎన్నో రెట్ల ధనం మీకు సమకూరుతుందని నమ్మబలికారు. దీంతో కొందరు భక్తులు భారీ సంఖ్యలో పుస్తకాలను కొనుగోళ్లు చేయగా, ఈ విషయం తెలిసి మరింతమంది భక్తులు ఆశ్రమానికి తరలివచ్చి పుస్తకాలను కొనుగోలు చేశారంటున్నారు.