ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం ఏం చేసిందనే శ్వేతపత్రం బీజేపీ ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 02:50 PM

అమరావతి: పవన్‌ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు మనకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్దతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్రం ఏం చేసిందనే శ్వేతపత్రం బీజేపీ ఇవ్వాలన్నారు. కాగితంపై పెట్టిన 27 పేజీల లెక్కలు చెప్పారే తప్ప, ఎంత మంజూరు చేశారో చెప్పలేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ చాలా బాగుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగున్నా నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పదవులు తీసుకొని సొంత పనులు చేసుకుంటూ పార్టీని విస్మరించడం తగదన్నారు. నిరంతరం పార్టీకి అండగా నిలవాలనే బాధ్యతను చాలా మంది విస్మరిస్తున్నారని ఆగ్రహించారు. టీవీలకు వెళ్లి వాస్తవాలు చెప్పండి అనే పరిస్థితిని కొందరు నేతలు కల్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో టీవీలలో పోలవరంపై ఒడిశా పిటిషన్‌కు సంబంధించిన వార్తలను చూసి చంద్రబాబు స్పందించారు. పోలవరంపై మీడియాలో వస్తున్న తాజా సమాచారాన్ని చంద్రబాబు నేతలకు చదివి వినిపించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అని, ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. తాజా సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి తగురీతిలో పరిష్కరించుకుందామన్నారు. పోలవరం సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందన్నారు. వడ్డించే వారు మనవారైతే చివరి పంక్తిలో కూర్చున్నా వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేటాయింపులు, విభజన హామీలపై తెలుగుదేశం సమన్వయ కమిటీలో మాట్లాడిన ఆయన ఇప్పుడు కేంద్రంలో వడ్డించే వారు మనవారు కాదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఆయన ఇందు కోసం ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com