అమరావతి: మనం ఢిల్లీ దేనికోసం వెళ్లాం, జగన్ దేని కోసం తిరిగారో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… మనం చేసినవి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని కాని జగన్ ఏది చేసినా కేసుల మాఫీ, లాలూచీ కోసమే చేస్తారన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ప్రకటిస్తారని మనకు తెలియక ముందే జగన్ వెళ్లి ఫొటో దిగారన్నారు. అడగకుండానే జగన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతిచ్చాడని పేర్కొన్నారు. జగన్నాటకాలు అని పత్రికలు రాసినట్లుగా ఆ నాటకాలను ప్రజలకు తెలపాలని నేతలకు సూచించారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం తిరిగి గెలవడం ఖాయమన్నారు.