ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 02:30 PM

ముంబైః అసలే వసూలు కాని వేల కోట్ల రుణాలతో కునారిల్లుతున్న భారత బ్యాంకింగ్ వ్యవస్థకు మరో షాకింగ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ విషయాన్ని ఆ బ్యాంకే బుధవారం వెల్లడించింది. ఇది ఇతర బ్యాంకులపై కూడా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముంబైలోని ఆ బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారికి లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది. కొందరు ఖాతాదారుల కోసమే ఈ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని సదరు ఖాతాదారుల అకౌంట్లలోకి ఇతర బ్యాంకులు కూడా భారీగా సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పీఎన్‌బీ ఓ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ కుంభకోణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఈ స్కాంపై విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పీఎన్‌బీ స్పష్టంచేసింది.  తమ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై ఈ స్కాం ఎలాంటి ప్రభావం చూపుతుందో పీఎన్‌బీ చెప్పలేదు. ఇక ఆ ఖాతాదారులకు డబ్బు జమ చేసిన ఇతర బ్యాంకుల వివరాలు కూడా వెల్లడించలేదు. ఈ లావాదేవీలను మళ్లీ రివర్స్ చేస్తారా, విచారణ సంస్థలు వీటిని తిరిగి రాబడతాయా అన్నదానిపై ఇప్పుడే స్పష్టంగా ఏమీ చెప్పలేమని ముంబైకి చెందిన బ్యాంకింగ్ అనలిస్ట్ అశుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ కుంభకోణం విలువ 2017లో పీఎన్‌బీ నికర ఆదాయానికి 8 రెట్లు కావడం గమనార్హం. ఈ విషయం బయటకు రాగానే ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు ఏడున్నర శాతం వరకు పడిపోయాయి. ఈ స్కాం తమపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నదో ప్రస్తుతం పీఎన్‌బీ లెక్కలేసే పనిలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com