ఏపీ బీజేపీ నేతలు నిన్న చెప్పిన నోట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఏపీకి ఏం చేశారో చెప్పాలి కానీ చేశామనే ప్రగల్భాలు వద్దని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదన్నారు. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరుస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్వయంగా ప్రకటించారనీ, ఆమేరకు నోట్ కూడా ఇచ్చారని వివరించారు. రెవెన్యూ లోటు విషయంలోనూ కేంద్రం కొర్రీలు పెడుతున్నదన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడి నేతృత్వంలోనే కమిటీ వేసి తెల్చాలన్నారు. ఇక విభజన అడ్డగోలుగా జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా సర్ ప్లస్ ఉంటే రాష్ట్రం మాత్రం వేల కోట్ల రెవెన్యూ లోటులో ఉందన్నారు. దానిని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు.