దేశ ప్రగతికి దిశా నిర్దేశం చేసేలా బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈరోజిక్కడ బడ్జెట్పై ప్రధాని మోడీ మాట్లాడారు. సామాన్యులు, వ్యాపారులు, అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉందన్నారు. వ్యాపార అనుకూలమే కాక సులభతర జీవన విధానానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు కేటాయించామన్నారు. పండ్లు, కూరగాయలు పండించే రైతుల కోసం ‘ఆపరేషన్ గ్రీన్స్’ చేపడుతున్నామని, ఆపరేషన్ గ్రీన్స్కు రూ.500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సహకార వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ దేశంలోని ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా గ్రామీణ భారతంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదక సంఘాల సేవలు విస్తృతం అవుతున్నాయన్నారు. రైతులు, దళితులు, గిరిజనులకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామీణ రహదారుల అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.