భువనేశ్వర్: ఒడిశాలో అత్యాచారబాధితురాలు ఆత్మహత్యకు నిరసనగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోరాపూట్ జిల్లా కుందులిలో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల గిరిజన బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో..కాంగ్రెస్, బీజేపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ దిగ్బంధం చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ పిలుపు నేపథ్యంలో విద్యార్థుల భద్రతాకారణాల రీత్యా స్కూళ్లు, కాలేజీలను మూసివేశామని, పరీక్షలను వాయిదా వేశామని అధికారులు వెల్లడించారు. అత్యాచారానికి గురైన గిరిజన బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. దీనికి బాధ్యత వహిస్తూ నవీన్పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఓపీసీసీ చీఫ్ హరిచందన్ డిమాండ్ చేశారు. 9వ తరగతి చదువుతున్న బాధిత గిరిజన బాలిక తనపై అత్యాచారం జరిగిన 100 రోజుల తర్వాత కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. ఆమెను అధికారులు, పోలీసులు, డాక్టర్లు మానసికంగా చాలా హింసించారని ఆయన ఆరోపించారు.