అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సాయం లేకుండా తాము ఎంతో కాలం ముందుకెళ్లలేమన్న విషయాన్ని పాశ్చాత్య దేశాలు గుర్తించాలని భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశానికి హాజరైన రాజన్.. ఏ దేశాన్ని నేరుగా ప్రస్తావించకుండా పాశ్చాత్య విధానాలపై ప్రసంగించారు.
పాశ్చాత్య దేశాల్లో జనాభా పెరుగుతోందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలి. అంతేగాక.. వారి ఉత్పత్తులకు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అండ లేకుండా పాశ్చాత్య దేశాలు ఎంతోకాలం మనుగడ సాధించలేవు. ఆ విషయాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాలి. ఆ దేశాలు సాధించే ప్రయోజనాలను కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలి. పాశ్చాత్య దేశాల దృక్పథం వీలైనంత త్వరగా మంచిగా మారాలి. లేదంటే ఈ ముక్కలైన ప్రపంచంలో ఏర్పడే సమస్యలను ఎవరూ పరిష్కరించలేరు’ అని రాజన్ అన్నారు.
ఆదాయ అసమానతల వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి సింగపూర్ లాంటి దేశాలు కొన్ని చర్యలు చేపడుతున్నాయని రాజన్ తెలిపారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కలిసి జీవించేలా హౌసింగ్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా డ్రైవర్ రహిత కార్ల సాంకేతికపై కూడా రాజన్ ప్రస్తావించారు. టెక్నాలజీ పరంగా అవి మంచివే అయినప్పటికీ.. డ్రైవర్ రహిత కార్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే.. కొంతమంది ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.