బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. మూడు పర్యాయాలుగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. ఈ ఏడాది చౌహాన్ ప్రభుత్వం మరోసారి ఎన్నికలకు వెళ్లనుంది. మధ్యప్రదేశ్లో మరోసారి గెలవడం ద్వారా సత్తా చాటాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. జనవరి 17 నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను శనివారం వెల్లడించారు. మెజార్టీ స్థానాలు కమలం పార్టీ సొంతం చేసుకుంది.
పది జిల్లాల్లోని 20 నగరపాలికల పరిషత్లు, నగర పరిషత్లకు ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సెమీఫైనల్గా ఈ ఎన్నికలను పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమలం పార్టీ బలంగా ఉండొచ్చు కానీ.. గుణ జిల్లాలోని రఘోగఢ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది.
రఘోగఢ్ మున్సిపల్ కౌన్సిల్లో 24 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 20 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. గత రెండు దశాబ్దాలుగా రఘోగఢ్-విజయ్పూర్ మున్సిపల్ కౌన్సిల్ను హస్తం పార్టీ కంచుకోటగా మార్చుకుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు తిరుగులేకుండా పోయింది. పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి ఫలించడం లేదు.